'దేవత'కు నివాళులు అర్పించేందుకు...

                     4న తెలుగు స్టార్స్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం 
దెయ్యాల లోకం నుంచి దేవత వెళ్లిపోయింది! సాటి దేవతలతో మంచిని-మమతను పంచుకునేందుకు దివికేగింది. తనని ఎంతగానో బాధపెట్టిన మానవ ప్రపంచానికి దూరంగా వెళ్లి సేద తీరుతోంది. ఇహలోకంలో ఏనాడూ సుఖపడని, భయంతో బతికిన శ్రీదేవి (వర్మ చెప్పాడు)..ఇప్పుడు స్వేచ్ఛగా అన్ని బంధనాల్ని తెంచుకుని స్వర్గసౌఖ్యాల్ని ఆస్వాదిస్తోంది. భయం అక్కర్లేని.. ఒకరిపై ఆధారపడి బతకాల్సిన పనేలేని ఓ కొత్త ప్రపంచం. అయితే భూమ్మీద తన వీరాభిమానులందరిని శోకంలో ముంచి తాను వెళ్లిపోయింది కాబట్టి కనీసం తనను సాటి తారాలోకం స్మరిస్తుందా? లేదా? అన్న సందేహంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది పైనుంచి!! 
అందుకే ఆ అతిలోక సుందరి కోసం తారాలోకం కదలొస్తోంది. తనతో కలిసి తెరను పంచుకున్న మేటి కథానాయకులంతా తనని సంస్మరించుకునేందుకు ప్రేమాభిమానాలతో కదలి వస్తున్నారు. తనతో గడిపిన కాలం, నాటి మధుర జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు తెచ్చుకునేందుకు టాలీవుడ్‌ స్టార్లు కదిలొస్తున్నారు. చిరంజీవి, కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబు వంటి ప్రముఖులు సంస్మరణకు వస్తున్నారు. మహేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి నవతరం స్టార్లు ఇందులో ఉన్నారు. ఇంకా ఎందరో స్టార్లు, కథానాయికలు ఈ సంతాప సంస్మరణ సభకు హాజరవుతున్నారు. శ్రీదేవి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న సుబ్బరామిరెడ్డి ఈ సంస్కరణ సభకు సారథ్యం వహిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌ స్టార్‌ హోటల్‌లో ఈ సంస్కరణ సభ జరగనుంది.

Comments