చూసీ చూడంగానే నచ్చేశారే..అడిగీ అడగకుండా వచ్చేశానే..మీ మనసులోకి.. హో అందంగా దూకి..అంటూ పాడగానే...హో మీరా నాయుడు గారు...ఎలా ఉన్నారు..బాగున్నారా...? అంటూ అటువైపు నుంచి మోడీ మాట వినిపించేసరికి మనసు ఉప్పొంగిపోయింది. కన్నీళ్లు గోదావరి వరదల్లా పొంగుకొచ్చాయి. ఇది చూసిన మోదీ ఎంటి...నువ్వా ఏడ్చేది. రాజకీయాలకే సిగ్గేసే విషయం...అనగానే మరేం చేయమంటారు? ప్రత్యేక హోదా గురించి జైట్లీ బావ ఇప్పుడే మాట్లాడాలా? ఇంకో ఏడాది వరకూ ఆగవచ్చు కదా...నేను..నా చెప్పుచేతుల్లో ఉన్న మీడియాతో నవ్యాంధ్ర ప్రజలను ఏదోరకంగా మాయ చేసే పక్కా ప్లాన్తో ఉన్నా. ఈ లోగా ఇప్పుడేదో కొంపములిగిపోయినట్టు జైట్లీ ఇలా అధికారికంగా ప్రకటన చేయడం మరేం బాగోలేదు..మా చిన్నోడు తెగ ఫీలైపోతున్నాడు. మా మంత్రి వర్గం రోడ్డుపైకి రాలేకపోతున్నారు. మీ మనసు నొప్పించే విధంగా నేనెప్పుడైనా చేశానా? మీరు చెప్పినట్టే ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా సంతకాలు చేశా..మీరు ఇస్తామని చెప్పిన ప్యాకేజీకే ఓకే అన్నా..ఇంతలోనే మీ మనసుకు ఏమైంది. నాలుగేళ్లలో ఏం సాధించకపో యినా..పెట్టుబడుల సదస్సులతో ప్రజలను ఓ మైకంలోకి నెట్టాను. వారిప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టే కదా మీకు..నాకు మిత్రుడైన పీకేను మధ్యమధ్యలో గెస్ట్ అపీరియన్స్ ఇప్పిస్తున్నా..నా తంటాలునేను పడుతుంటే జైట్లీ బావా భలే ట్విస్ట్ ఇచ్చాడు. జైట్టీ బావ కొత్తగా ఏం చెప్పలేదు కదా...పాత విషయాన్నే కొత్తగా ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పాడు. నాపై ప్రేమ తగ్గిపోవడానికి కారణమేంటి? చెప్పాలి..మీరు చెప్పాలి. మీకు మరో 25 నిమషాలు టైం ఇస్తున్నా..లేదంటే మా ఆర్కేకు చెబుతా ఏదో వండివార్చేస్తాడు..లేదంటే మీరంటే ఎక్కువ ఇష్టపడే మరో పెద్దాయనకు రిక్వస్ట్ చేస్తా ఆయనే బాగా మసాలా దట్టించి ప్రధాన పేజీలో బ్యానర్ హెడ్డింగ్ పెట్టి మరీ నమ్మించేలా కథనం రాసేస్తాడు. చెప్పండి ప్రియ మోడీజీ. ఏం చేయమంటారు. నా మనసును ఎందుకు గాయపరిచారు. ఎన్నికలు పూర్తయిన వరకూ మా మంత్రులు కొనసాగితే..పెన్షన్ కూడా వచ్చేది. వాళ్ల పొట్టకొట్టడం మీకు న్యాయమా? రాజకీయాలు అన్న తరువాత సవాలక్ష హామీలు ఇస్తాం..అవి తీర్చమని అడగడం ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు ఆనవాయితీ. కాదనడం లేదు. ఈ 40 ఏళ్లలో ఎన్ని చూడలేదు. అయితే ఈ 40 ప్లస్లో ఇదేదో కొత్త కాన్సప్ట్ అనిపిస్తోంది. గోదావరి చూస్తూ కాలక్షేపం చేయక వీర్రాజు ఎందుకు అలా మాట్లాడాడు? ఏం..కావాలంటే పెట్టుబడుల సదస్సు పాపికొండల్లో పెట్టే వెసులుబాటు నేను చేయనా? ఇవైమైనా నిజమైనా పెట్టుబడులా? ప్రజలు గుర్తుపట్టని వ్యక్తులకు నల్లకోట్లు, టైలు వేసి ఎంవోయూ కుదుర్చుకోవడం రాజకీయ ఎత్తుగడ. ఇదంతా నిజమే అనుకుని బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు. నేను మా మంత్రులను ఎలా ఓదార్చేది. వాళ్లకూ నాలుగు డబ్బులు కావాలి కదా..మీరు ఇన్ని చేసినా నేనెందుకు మౌనంగా ఉన్నానంటే..మీరంటే పిచ్చి ప్రేమ. మళ్లీ చెబుతున్నా..మంత్రులు బయటకు వచ్చినా...మేం మాత్రం మీతోనే కలిసి ఉంటాం. అర్థం చేసుకోండి..ఓటుకు నోటు సాక్షిగా మీకిచ్చిన మాట నేను జవదాటడం లేదు. మీ వీర్రాజు..విష్ణుకుమార్ రాజుచేత నన్ను అన్పాపులర్ చేసినా మీరంటే నాకు చాలా ఇష్టం. మీ మనసు మార్చుకోకండీ..మళ్లీ మీరు..నేను..మన పీకే ముగ్గురం ప్రేమగా ఉందాం. ప్రేమించుకుంటునే ఉందాం. ఎంత పెద్ద సమస్యనైనా దానిని డైవర్ట్ చేయడానికి మన పీకే ఉన్నాడు. నవ్యాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉంది. గెస్ట్ అపీరియన్స్కు మార్కులు బాగానే పడుతున్నాయి. పక్కా స్క్రిప్ట్ అందిస్తే ఇక ఆర్.నారాయణమూర్తి ఎందుకూ పనికిరాడు. పూనకమే పూనకం..అది చాలు నేను స్థిమితంగా ఉండేందుకు. ఇంత బాగా స్కెచ్ వేస్తే..జైట్లీ బావ పెన్సిల్ గీతను ఎరైజర్ చెరిపేశాడు. మోదీజీ మీరైనా చెప్పండి..ప్లీజ్..నవ్యాంధ్రలో ఇక నన్ను నమ్మేదెవరు? అమరావతి సాక్షిగా హోదాపై ఎన్నిసార్లు మాట మార్చానో మీకు తెలుసుకదా? 29 సార్లు ఢీల్లీ వచ్చాను. కనీసం మీ మనసులో భావం 40 ఏళ్ల రాజకీయ చరిత గల నాకు తెలియకపోవడం సిగ్గేసే విషయమే. ఈ జగన్ పాదయాత్ర చేసుకోకుండా ట్విస్ట్ల ట్విస్ట్లు ఇచ్చేస్తున్నాడు. అవిశ్వాసం ఆయన పెడతానన్నాడు. మద్దతు ఇమ్మన్నాడు. ఇప్పుడేమో మీరు పెట్టినా సరే మద్దతు ఇస్తానంటున్నాడు. అస్సలు అర్థం కావడంలేదు జగన్ స్టాండ్. మోడీజీ...ఒక్కసారి మనసు విప్పి మాట్లాడండీ..నన్ను అర్థం చేసుకోండి. నన్ను నా జాతీయ పార్టీని గట్టెక్కించండి. జై జన్మభూమి..జై మోడీజీ..జైజై పీకే..జైజైజై ప్యాకేజీ...
Comments
Post a Comment