చెవుల్లోనే పేలిపోయిన హెడ్‌ఫోన్స్‌

ఇంతవరకూ ఫోన్లే పేలిపోయాయి. ఇప్పుడు తాజాగా హెడ్‌ఫోన్స్‌ పేలిపోతున్నాయి. ఇటువంటి సంఘటనే బ్రెజిల్‌లో సంభవించింది. ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండగానే, హెడ్‌ ఫోన్‌ ద్వారా లూయిసా పిన్హిరో (17) అనే అమ్మాయి మాట్లాడుతున్న సందర్భంలో అనూహ్య ప్రమాదం జరిగింది. భారీ విద్యుత్‌ వల్ల హెడ్‌ ఫోన్లు పేలిపోయాయి. దీంతో బాధిత యువతి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
బ్రెజిల్లోని రియాస్‌ ఫ్రియోకి చెందిన లూయిసా పిన్హిరో(17) అపస్మారక స్థితిలో పడివుండగా బాలిక అమ్మమ్మ గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైద్యులు ఆమె జీవితాన్ని రక్షించలేకపోయారు. భారీ విద్యుత్‌ షాక్‌ వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఎలక్ట్రిక్‌ షాక్‌ తగిలిన గంట తరువాత అపస్మారక స్థితిలో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారనీ , హెడ్‌ఫోన్స్‌ చెవుల్లో కరిగిపోయినట్లు ఆస్పత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Comments