భానుమతిగా స్వీటీ

అందం.. అభినయం...రెండూ కలిస్తే అనుష్క. సినిమా సినిమాకు తనేంటో నిరూపించుకుంటోంది. లేటెస్ట్‌ హిట్‌ భాగమతితో అందుకుంది. ఇప్పుడు తాజా కబురు ఏంటంటే...సావిత్రి సినిమాలో ఓ ముఖ్య పాత్రలో మెరవనుంది ఈ బ్యూటి. 
నేత్రాభినయంతోనే జన స్రవంతిని మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి సావిత్రి జీవితం నాటకీయతలో ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. తారాజువ్వలా తారామండలానికి ఎగిసి, మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి, రోగగ్రస్తమై, శల్యావశిష్టమైన శరీరంతో జీవన రంగస్థలి నుంచి నిష్క్రమించిన తారామణి ఆమె. కరుణకు, పరోపకారానికి చిరునామా అయిన ఆ సహృదయురాలి కథ కరుణామయ గాధగా మిగిలిపోవడం గుండెలు పిండేటంతటి విషాదం. అంతటి మహనటిని బయోపిక్‌గా తెరకెక్కుతుంది. నాగ్‌ అశ్విన్‌ డైరక్టర్‌గా, వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో షూటింగ్‌ కొనసాగుతుంది. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమాలో ఇప్పటికే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తుండా... జెమినీ గణేషన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో విజయ్‌ దేవరకొండ, జమున పాత్రలో సమంత, ఎస్వీ రంగారావుగా మోహన్‌ బాబు, వీఎన్‌ జానకిగా షాలినీ పాండే, ఆలూరి చక్రపాణిగా ప్రకాశ్‌ రాజ్‌, సింగీతం శ్రీనివాస్‌ రావుగా తరుణ్‌ భాస్కర్‌లు నటిస్తున్నారు. తాజా మహానటి గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. 
 ఇటీవల విడుదలైన 'భాగమతి' మూవీతో మెప్పించిన అనుష్కకు మరో మంచి ఆఫర్‌ వెతుక్కుంటూ వచ్చింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మహానటి సావిత్రి బయోపిక్‌లో భానుమతి పాత్ర కోసం అనుష్కను చిత్ర యూనిట్‌ సంప్రదిస్తోంది. ఇందుకోసం స్వయంగా నిర్మాత అశ్వినీదత్‌ రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే అనుష్క నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఈ మూవీలో నటిస్తున్నట్లు ఎలాంటి సమాచారం రాలేదు.

Comments