మార్చి 2 నుంచి సినిమాలుండవ్‌!

సౌత్‌ సినీ నిర్మాతలు, డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీనికి నిరసనగా సౌత్‌ ఇండియా నిర్మాతల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వెండితెర మూగబోనుంది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు డిజిటల్‌ సర్వీస్‌ పైనే ఆధారపడుతోంది..ప్రపంచం మొత్తం డిజిటల్‌ సిస్టమ్‌ రావటంతో శాటిలైట్‌ ద్వారానే సినిమా ప్రదర్శన జరుగుతోంది. దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా ప్రొజెక్టర్‌ అవసరం లేకుండానే ఇప్పుడు సినిమా చూసేయవచ్చు. సౌత్‌ ఇండియాలోని అన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీలు ఈ టెక్నాలజీని ఉపయోగిం చుకుంటున్నాయి. అయితే విచ్చలవిడిగా పెరిగిపోయిన డిజిటల్‌ శాటిలైట్‌ రేట్లు నిర్మాతలకు తలకుమించిన భారంగా తయారయ్యాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు తమకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటుపోతున్నారు. దీంతో సొంతంగా సినిమా రిలీజ్‌ చేయాలనుకుంటున్న నిర్మాతలకు ఖర్చు భారీగా అవుతుంది. డిజిటల్‌ రేట్లు తగ్గించే విషయంపై తెలుగు, తమిళ, కన్నడ, మళయాల ఫిల్మ్‌ ఛాంబర్స్‌ ఇప్పటికే డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో చర్చలు జరిపారు. కానీ కొన్ని విషయాల్లో సానుకూలంగా వున్నా మరి కొన్ని విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం కుదరటం లేదు. డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ముందు సౌత్‌ ప్రొడ్యూసర్స్‌ కమిటీ ప్రధానంగా మూడు డిమాండ్లను ఉంచింది. మొదటిది వీపీఎఫ్‌(వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు) తగ్గించాలి, లేదా రద్దు చేయాలి. రెండవది సినిమా ప్రారంభంలో, మధ్యలో వేస్తున్న యాడ్స్‌ను ఎనిమిది నిమిషాలకే పరిమితం చేయాలి. మూడవది రెండు కొత్త సినిమాల ట్రైలర్స్‌ ప్రతి సినిమాతో ఉచితంగా ప్రదర్శించాలి. అయితే తాజాగా మరోసారి చర్చలు విఫలమవ్వడంతో మార్చి 2 నుంచి సౌత్‌ ప్రొడ్యూసర్లు సినిమా థియేటర్ల బంద్‌ కు రెడీ అవుతున్నారు. మరోవైపు మార్చిలో సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్‌ చేసుకొన్న నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇప్పటికే రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేసుకున్న నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు సినిమా కరెక్ట్‌ టైంకు రిలీజ్‌ కాకపోతే ఫైనాన్స్‌ పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సౌత్‌ ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడితే, మార్చి రెండు నుంచి ఏ సినిమాలు రిలీజ్‌ కావు.

Comments