మహూర్తాన్ని ఖరారుచేసిన సీఎం కేసీఆర్..? షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యకు ఛాన్స్..
తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ అనివార్యం అయింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన మంత్రివర్గాన్ని స్వల్ప మార్పులు, చేర్పులతో విస్తరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముహూర్తాన్ని కూడా ఖరారుచేసినట్లు సమాచారం. ఆసన్నమైన ఎన్నికల సమయం నేపథ్యంలో దాదాపు అన్ని ప్రధాన పార్టీలు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిపెట్టాయి. ఈ సంవత్సరంలో పదవుల పందేరం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గంలో కొంతమందిని తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటారని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎస్సీలకు, మహిళలకు విస్మరించారనే విమర్శలు ఉన్నందున, ఈ సారి తప్పకుండా ఆ వర్గాలకు చోటు కల్పిస్తారని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభలో ముగ్గురికి చోటు దక్కనుందని, అందులో ఇప్పటివరకు పదవులు రాని వారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ముఖ్యమైన 40 వరకు నామినేటెడ్ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి పద్మారావుగౌడ్ను మంత్రిపదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నియోజక వర్గానికే పరిమితం కావడం, జిల్లాలపై కానీ తన సామాజికవర్గంలోనూ రాజకీయంగా గట్టి పట్టులేకపోవడం వంటి కారణాలతో మంత్రివర్గం నుంచి తప్పించి, కార్పొరేషన్ పదవిని అప్పగిస్తారని టీఆర్ఎస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్ను మంత్రివర్గంలో తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ పరిచయాలు ఉండడం, అవి ఎన్నికలకు బాగా పనిచేస్తాయన్నది టీఆర్ఎస్పార్టీ ఆలోచన. అయితే ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం త్వరలో ముగిసి పోతుండడంతో, ఆ లోగా మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేక ఆ తర్వాతా? అన్నది మాత్రం సస్పెన్స్. ఒకవేళ అదే జరిగితే శాసనమండలి చైర్మెన్గా ఎవరన్న దానిపైనా ఉత్కంఠ ఉంది. కడియం శ్రీహరిని మండలి చైర్మెన్గా నియమిస్తారని వార్తలు వస్తున్నా, అందులో వాస్తవం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్న విమర్శ కేసీఆర్పై ఉంది. రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి కడియం శ్రీహరికి కట్టబెట్టడంపైనా ఆ వర్గాల్లో ఆగ్రహం నెలకొంది. ఈ సమయంలో కడియంను తప్పించి ప్రాధాన్యత తగ్గించారని ప్రచారం జరిగితే మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆయనను తప్పించకుండా మరో ఎస్సీని మంత్రివర్గంలో తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. కొప్పుల ఈశ్వర్ను మంత్రివర్గంలో తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. అదేవిధంగా చందూలాల్, నాయిని నర్సింహారెడ్డిలను తప్పిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. వారి స్థానంలో రేఖా నాయక్ను గానీ, కోవా లక్ష్మీని గానీ తీసుకుంటారని తెలిసింది. నాయిని స్థానంలో గుత్తా సుఖేందర్రెడ్డిని గానీ, నిరంజన్రెడ్డిలను తీసుకునే అవకాశం ఉంది. అయితే లక్ష్మారెడ్డిని కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.అదేవిధంగా షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేరు కుడా మంత్రి వర్గం ప్రస్తావనలో ఉన్నట్టుగా తెలిసింది.సౌమ్యుడుగా పేరున్న అంజయ్యకు ఉమ్మడి జిల్లాల నుండి అంజయ్యకు అవకాశం కల్పిస్తున్నట్టు సమాచారం.అవసరమైతే నామినేట్ పదవుల్లో
కుడా అంజయ్య పేరు ప్రస్తావనకు వస్తున్నట్టు చెబుతున్నారు.మహిళా కోటలో ఒకవేళ పద్మా దేవేందర్ రెడ్డీకి మంత్రి ఛాన్స్ వస్తే ఎమ్మెల్యే అంజయ్యకు డిప్యూటీ స్పీకర్ అవకాశం కుడా ఇచ్చేటట్టు పరిశీలన చేసినట్టు సమాచారం.
మార్చిలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాలకోసం టీఆర్ఎస్ పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు. బీసీ వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తానని సీఎం కేసీఆర్ హావిూ ఇచ్చారు. అయితే అది ఇప్పుడా, తర్వాత అన్నది మాత్రం చెప్పలేదు. ఈ సారి రాజ్యసభకు టీ న్యూస్ ఎండీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్కుమార్ను పంపిస్తారని విూడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని పార్టీ వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు. నాయిని నర్సింహారెడ్డిని రాజ్యసభకు పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతున్నది.ఏది ఏమైనప్పటికీ మరోసారి కేబినెట్ విస్తరణ పైన అందరి దృష్టి మరలింది.

Comments
Post a Comment