గర్భసంచులు కొంటాం..గర్భ సంచులు కొంటాం!!

పాతసామాన్లు కొంటాం..పాత సామాన్లు కొంటాం...ఇది ఓల్డ్‌...గర్భసంచులు కొంటాం..గర్భ సంచులు కొంటాం ఇది న్యూ. గర్భ సంచులేంటి? కొనడమేంటి? ఇదేగా మీ డౌటు. మీకు పూర్తిగా అవగాహన కలగాలంటే భీమిలికి చెందిన జ్యోతిని సంప్రదించండి. మీరు అర్థమయ్యేటట్టు పూర్తి డెమో ఇస్తుంది. 
సరోగసి అన్నా, అద్దె గర్భమన్నా ఇప్పుడు అందరికీ తెలుసు. గర్భ సంచి మార్పిడి గురించి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా సరిగా తెలీదు. భారత్‌లో అక్కడక్కడా గర్భసంచి మార్పిడి ప్రయోగాలు మాత్రమే జరిగాయి. ఇదీ విషయం. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని ఓ మాయలేడి అమాయక మహిళలను బురిడీ కొట్టించింది. గర్భసంచులు కొంటామంటా టోపీ పెట్టింది. పిల్లలు పుట్టాక.. ఆపరేషన్‌ కూడా చేయించుకున్నాక... ఇక పీరియడ్స్‌ గోల ఎందుకని కొంతమంది గర్భసంచులు తొలగించుకుంటుంటారు. అలా తొలగించుకొనే గర్భసంచులకు లక్షలకు లక్షలు ఇస్తామంటే ఎవరాశపడరు? జ్యోతి కొత్తగా ఆలోచించింది. చక్కటి స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగింది. దొరికినంతం దోచుకుని చెక్కేసింది. 
ఈ బ్రోకర్‌ పేరు జ్యోతి.. బాధితులు చెబుతున్నదాని బట్టి.. ఈ కిలాడీది భీమిలీ. విజయనగరంలోని నిరుపేద మహిళలకు టోపీ వేసింది. విదేశాల్లో గర్భసంచులకు బోలెడు గిరాకీ ఉందని, మీకు పిల్లలు పుట్టారు, ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు. ఖాళీగా పడి ఉండే గర్భసంచి అమ్మితే లక్షలకు లక్షలు వచ్చి పడతాయని నైస్‌గా నచ్చ చెప్పింది. జ్యోతి మాటలకు విజయనగరం జిల్లా కేంద్రం కమ్మ వీధిలో కొంతమంది మహిళలు పడిపోయారు. గర్భసంచి ఇస్తే ఎనిమిది లక్షలు ఇస్తారని బాధితులకు జ్యోతి ఆశపెట్టింది. సరే గర్భసంచే కదా ఇస్తే లక్షలు వస్తాయి కష్టాలు తొలగిపో తాయని అనుకున్నారు. వీరికి తెలిసి ఇక్కడ ఎనిమిది మంది గర్భసంచులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. 
తీరా ఆపరేషన్‌కి తీసుకెళతానన్న రోజున జ్యోతి మొహం చాటేసింది. అద్దెకున్న ఇల్లు ఖాళీ చేసింది. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. అదేంటి గర్భసంచి ఆపరేషన్‌ చేయలేదు. వీరికి ఇప్పిస్తానన్న లక్షల మొత్తం ఇప్పించలేదు. ఇంకెందుకు వీరు పోలీసుల దగ్గరకొచ్చారనేగా అనుమానం. అసలు మోసం ఎక్కడ జరిగిందోవినండి. 
గర్భసంచి మార్పిడి ఇండియాలోనే లేనేలేదని, ఎక్కడైనా జరిగితే ప్రయోగదశలో మాత్రమే ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. అసలు మోసం ఏంటంటే, జ్యోతి అనే కిలాడి గర్భసంచి మార్పిడి చేయించదు. వీరి గర్భసంచులను ఎవరూ కొనరు. కానీ ఆ ఆశ పెట్టి జ్యోతి వీరి దగ్గర నుంచి లక్షలు మోసం చేసింది. కేవలం విజయనగరం కమ్మవీధిలో ఎనిమిదిమంది మాత్రమే జ్యోతి బాధితులు బయట పడ్డారు. పోలీసులు డొంక లాగితే ఇంకెంతమందిని జ్యోతి మోసం చేసిందో తెలుస్తుంది.

Comments