టిటిడి ధార్మిక యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి




  • ఉగాది నాటికి పూర్తిస్థాయిలో టిటిడి హెచ్‌డిపిపి వెబ్‌ అప్లికేషన్‌
  • తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

  •  ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టిటిడి నిర్వహిస్తున్న ధార్మిక యజ్ఞంలో  హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం  టిటిడి అన్ని ప్రాజెక్టుల అధికారులు, ఐటి అధికారులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు సనాతన ధర్మ ప్రచారంలో ఎక్కువ మందిని భాగస్వాములను చేయడానికి టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా వెబ్‌ అప్లికేషన్‌ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెచ్‌డిపిపి తయారు చేస్తున్న ఈ వెబ్‌ అప్లికేషన్‌ను ఉగాది నాటికి పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.  నూతనంగా రూపొందిస్తున్న ఈ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా 10 సం|| పిల్లల నుండి వృద్ధుల వరకు సభ్యులుగా చేరవచ్చని తెలియజేశారు. వివిధ ధార్మిక విభాగాలలో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి దేశ విదేశాలలో టిటిడి నిర్వహించే ధార్మిక కార్యక్రమాలలో వీరి సేవలను స్వచ్చంధంగా వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. ఇందులో స్తోత్ర పఠనం, భజనలు, ఉపన్యాసకులు, ఆలయ నిర్వహకులు, ధార్మిక స్వచ్చంధ సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.   హెచ్‌డిపిపిలో సభ్యత్వం ద్వారా టిటిడి హెచ్‌డిపిపి వెబ్‌సైట్‌లో ఉంచిన 100 పేజీలలోపు వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలు, అన్నమయ్య సంకీర్తనలు, ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు రూపొందించే సిడిలలోని కీర్తనలను ఉచితంగా పొందవచ్చన్నారు. అంతేగాక పండుగలు, పర్వదినాలలో టిటిడి నిర్వహించే ధార్మిక కార్యక్రమాలలో వీరిని భాగస్వాములను చేయనున్నట్లు ఆయన వివరించారు. ఫిబ్రవరి 13వ తేదీ మహాశివరాత్రి పర్వదినానికి సభ్యుల నమోదు కార్యక్రమం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఐటి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్ట్‌ల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ప్రాజెక్ట్‌ అధికారి శ్రీ రమణప్రసాద్‌, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

    Comments