పాక్ తోక వంక‌ర‌

 
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ తన వంకర బుద్ధి మానుకోలేదు. కనీసం మానవత్వం మరిచిపోయింది.కుల్‌భూషణ్‌ జాదవ్‌ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్‌ ప్రవర్తించిన తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా కుల్‌భూషణ్‌ వ్యవహారంపై రాజ్యసభలో నేడు సుష్మా స్వరాజ్‌ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాక్‌ అవమానంపై కంటతడి పెట్టారు. జాదవ్‌ను పాకిస్థాన్‌ అవమానపరిచిందన్నారు. జాదవ్‌ కుటుంబం పట్ల పాక్‌ అభ్యంతరకరంగా వ్యవహరించిందని.. పాక్‌ వ్యవహారం భారత్‌ మనోభావాలను దెబ్బతీసిందన్నారు. కొడుకుతో తల్లి.. భర్తతో భార్య సమావేశాన్ని పాకిస్థాన్‌ ప్రచారానికి ఉపయోగించుకుందన్నారు. భద్రత పేరుతో వారు ధరించిన దుస్తులను బలవంతంగా మార్పించారు. మంగళసూత్రాలు తీయించడం బాధాకరమన్నారు. వితంతువులుగా వారిని చూపించారు. కుల్‌భూషణ్‌ తల్లితో మాట్లాడా. తనను చూడగానే తండ్రి ఎలా ఉన్నాడని అడిగాడని చెప్పింది. ఎందుకంటే మంగళసూత్రం లేకుండా ఉండటాన్ని గమనించి భయాందోళనకు గురై ఈ విధంగా అడిగాడు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. కుల్‌భూషణ్‌ తల్లి మరాఠిలో మాట్లాడేందుకు అనుమతించలేదు. ఇద్దరు పాక్‌ అధికారులు సమావేశంలో ఉన్నారు. వారు పదే పదే అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆమె అలాగే మాట్లాడుతుండగా ఇంటర్‌కంను బంద్‌ చేశారు. భేటీ సందర్భంగా కుటుంబ సభ్యుల హక్కులు పదేపదే కాలరాయబడ్డాయి. షూలో కెమెరా లేదా రికార్డింగ్‌ పరికరం ఉందని పేర్కొంటూ పాక్‌ వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. ఇది ఎంతో అసంబద్ధమైన చర్య. ఆమె రెండు విమానాల్లో ప్రయాణించి భర్త వద్దకు చేరుకుందన్నారు. జాదవ్‌ కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడుతున్నామని, కుల్‌భూషణ్‌ను విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్లు సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు.

Comments